(vinayaka chavithi, ganapathi puja, vinayaka vrata kalpam, వినాయక చవితి, గణపతి పూజ,గణపతి పూజా విధానం, వినాయక వ్రతకల్పం)
15) ఋషుల భార్యలకి ఆ శాపం తగులుట
సరిగ్గా ఆ రోజు ఆ సమయంలో భూలోకంలో సప్తర్షులు ఓ యజ్ఞం చేస్తున్నారు. వారి భార్యలు అగ్నిప్రదక్షిణం చే స్తూండగా, అగ్నిదేవుడు ఆ ఏడుగురి భార్యలను చూసి ప్రేమలో పడ్డాడు. కాని వారిని ఏం చేయలేనివాడై, క్షీణించసాగాడు. ఈ సంగతి గ్రహించిన అగ్నిదేవుడి భార్య అయిన స్వాహా దేవి భర్త కోరికను తీర్చాలనుకుంది. అరుంధతి తప్ప, మిగిలిన ఆరుగురి రూపాలను తన మహత్తుతో ధరించి అగ్నిదేవుడి కోరికను తీర్చింది. ఆ ఆరుగురు మునులు అది చూసి, తమ భార్యల శీలాన్ని శంకించి వాళ్లను వదిలేశారు. పార్వతి ఇచ్చిన శాపం వల్ల ఆ విధంగా చంద్రుణ్ని చూసిన ఆ ఆరుగురు భార్యల మీద, తాము చేయని నేరం వచ్చి పడింది.
ఈ వివాదం శ్రీహరి దృష్టికి వచ్చింది. ఆయన తన దివ్యదృష్టితో జరిగింది గ్రహించి, ఆ ఋషుల దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పాడు.
‘‘పార్వతీదేవి శాపం వల్ల ఇలా జరిగిందని మీరు నా ద్వారా తెలుసుకోగలిగారు. మరి నా సహాయం పొందలేని సామాన్యులకి కూడా మనం మేలు చేయాలి కదా. పదండి’’
శ్రీహరి అందరినీ వెంట తీసుకుని కైలాసానికి వెళ్లాడు. కడుపు పగిలి మరణించి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి పార్వతికి సంతోషాన్ని కలిగించాడు. శ్రీహరి వెంట వచ్చిన వారంతా పార్వతిని ఇలా ప్రార్థించారు.
‘‘తల్లీ! పార్వతీ! నువ్వు చంద్రుడికి ఇచ్చిన శాపం వల్ల లోకులకు అనేక కష్టాలు వచ్చి పడుతున్నాయి. దయతో ఈ శాపాన్ని ఉపసంహరించి అందరినీ కాపాడు’’
బ్రతికి వచ్చిన విఘ్నేశ్వరుడిని ముద్దు పెట్టుకుని పార్వతి తృప్తిగా చెప్పింది.
‘‘సరే. ఏ రోజున చంద్రుడు మా అబ్బాయి విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజున మాత్రం చంద్రుడిని చూడకూడదు. చూస్తే ఇలాంటి నీలాపనిందలు తప్పవు. మిగిలిన రోజుల్లో చూసినా ఏం కాదు’’
బ్రహ్మ, ఇతర దేవతలు అది విని సంతోషించి, తమ తమ స్థానాలకు వెళ్లారు. అప్పటినుంచి భాద్రపద మాస శుద్ధ చవితినాడు చంద్రుడిని చూడకుండా ప్రజలు జాగ్రత్తపడుతూ అంతా సుఖంగా జీవించసాగారు. ఇలా కొంతకాలం గడిచింది.







0 comments:
Post a Comment