(vinayaka chavithi, ganapathi puja, vinayaka vrata kalpam, వినాయక చవితి, గణపతి పూజ,గణపతి పూజా విధానం, వినాయక వ్రతకల్పం)
12) విఘ్నేశ్వరుని కథ
ఓరోజు నైమిశారణ్యంలో శౌనకుడు ఇతర మహర్షులని సూత మహర్షిని కలిశాడు. సత్సంగ కాలక్షేపం కోసం ఆయన శౌనకుడు, ఇతరులకి వినాయకుడి పుట్టుక, చంద్రుణ్ని దర్శిస్తే వచ్చే దోషం, దాని నివారణ గురించి సూత మహాముని శౌనకుడు ఇతర మునులకి చెప్పాడు.
పూర్వం ఏనుగు రూపంలో గల గజాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై గజాసురుని అడిగాడు.
‘‘స్వామీ! నువ్వు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివాసం ఉండాలని నా కోరిక’’
భక్తులకి తేలికగా ప్రత్యక్షమై, వారి కోరికలని ఇట్లే తీర్చి తన మీదకి తెచ్చుకొనే స్వభావం గల శివుడు గజాసురుడి పొట్టలోకి ప్రవేశించి హాయిగా నివశించసాగాడు.
అక్కడ కైలాసంతో పార్వతీదేవి తన భర్త అయిన శివుడి జాగ తెలియక ఆయన కోసం అన్వేషిస్తూ, ఆయన గజాసురుడి పొట్టలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంది. దానితో పార్వతి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి ఏడుస్తూ వెళ్లి జరిగింది చెప్పి, ఆయన సహాయం కోరింది.
‘‘ఓ మహానుభావా! పూర్వం భస్మాసురుడి నుంచి నువ్వు నా భర్తని రక్షించావు. అలాగే ఇప్పుడు నువ్వు గజాసురుడి బారి నుంచి కూడా అయన్ని విడిపించి రక్షించాలి’’
శ్రీహరి ఆమెను ఊరడించి చెప్పాడు.
‘‘శివుని వాహనమైన నందిని నా దగ్గరకు పంపు నీ కోరిక తీరుస్తాను. గజాసురసంహారానికి గంగిరెద్దుల మేళమే తగినది’’
బ్రహ్మ, ఇతర దేవతలందరినీ వెంటనే రావలసిందిగా విష్ణుమూర్తి కబురు పంపాడు. నందిని గంగిరెద్దుగా అలంకరించి దేవతలకి తలో వాయిద్యం ఇచ్చి, తనూ చిరుగంటలూ సన్నాయిని అందుకుని, వారందరితో గజాసురుడి దగ్గరికి వెళ్లాడు.
ఆ ఊళ్లో మనోహరంగా సాగే ఆ గంగిరెద్దు మేళాన్ని గురించి విన్న గజాసురుడు దాన్ని స్వయంగా చూసిఎంతో వినోదించాడు. మేళం పెద్దయిన శ్రీహరితో చెప్పాడు.
‘‘నరుడా! నీకేం కావాలో కోరుకో’’
‘‘అయ్యా!ఇది శివుడి వాహనమైన నంది. శివుని కోసం వచ్చింది. కాబట్టి దానికి ఆయన్ని చూపించు. తర్వాత మా దారిన మేం వెళతాం’’
అది వినగానే గజాసురుడు ఉలిక్కిపడ్డాడు. తన పొట్టని చీల్చుకుని కానీ శివుడు బయటికి రాలే డు. వస్తే తనకు మరణం తప్పదు. దివ్యదృష్టితో గజాసురుడు ఆ కోరిక కోరింది శ్రీహరి అని తెలుసుకుని, ఇక తనకి చావు తప్పదని గ్రహించి తన కడుపులోని శివుణ్ని ఇలా కోరాడు.
‘‘స్వామీ! నేను మరణించాక నా తలను మూడు లోకాలలో పూజించేలా చేయి. నా చర్మాన్ని నువ్వు ధరించు’’
శివుడు అందుకు అంగీకరించగానే, శ్రీహరి నందికి సైగ చేశాడు. నంది తన కొమ్ములతో గజాసురుని కడుపు చీల్చి అతన్ని చంపేసింది. పొట్ట నుంచి బయటపడ్డ శివుడితో శ్రీహరి చెప్పాడు.
‘‘పరమశివా! దుర్మార్గులకి ఇలాంటి వరాలు ఇవ్వడం పాముకి పాలు పోయడంతో సమానం సుమా!’’
బ్రహ్మను, ఇతర దేవతలను, వారి వారి లోకాలకు పంపించేసిన శ్రీహరి కూడా వైకుంఠానికి వె ళ్లిపోయాడు. శివుడు నందిని ఎక్కి కైలాసానికి బయలుదేరాడు.







0 comments:
Post a Comment